మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సంస్థలో 35 ఏళ్లకు పైగా పనిచేసి రిటైరైన తర్వాత కూడా బకాయిలు రాకుంటే బతికేదెట్ల అని ఆర్టీసీ విశ్రాంత ఉద్యో గుల ఫోరం ప్రధాన కార్యదర్శి కె.రవీందర్రెడ్డి ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ చౌరస్తాలోని టీఎన్జీవోల సంఘ భవనంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలే అరకొర వేతనంతో రిటైరైన తాము పెన్షన్ లేక వయసు మీదపడుతూ రోగాలు చుట్టుముట్టి ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నామన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అధ్యక్షుడు ఎ.రాజసింహుడు మాట్లాడుతూ 2017, 2021 పీఆర్సీలకు చెందిన డిఫరెన్స్ ఎరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఈనెల 8న చేపట్టే ‘చలో అసెంబ్లీ’ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలోనాయకులు జి.బి.పాల్, భగవంతు, ఆర్.నారాయణ, వి.రామచంద్రయ్య, వహీద్, మజీద్ఖాన్, జహీరొద్దీన్ పాల్గొన్నారు.
15న మెడికల్ కళాశాలలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ
పాలమూరు: మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం కాంట్రాక్టు పద్ధతిన ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, జూనియర్ రెసిడెంట్స్ నియామకం కోసం ఈనెల 15న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలి పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.gmcmbnr.org.in వెబ్సైట్లో చూడాలని సూచించారు.


