మహబూబ్నగర్ క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ డి.జానకి సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజవాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కో ఫిర్యాదును పరిశీలించి.. ఆయా స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ సమస్యపై ఆరా తీశారు. ప్రతి స్టేషన్లో జా ప్యం లేకుండా ఫిర్యాదులు పరిష్కరించే దిశగా ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలన్నారు. పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
నిబంధనలు పాటించకపోతే లైసెన్స్లు రద్దు
పాలమూరు: ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం నగరంలోని శ్రీకర్ చిల్డ్రన్, భవిత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సర్టిఫికెట్లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీకర్ ఆస్పత్రిలో ఫైర్ ఆడిట్, మాక్డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బందిలో మార్పులుంటే ముందస్తు అనుమతి పొందాలని, ధరల పట్టికను తెలుగులో ఏర్పాటు చేయాలని సూచించారు. తనిఖీల్లో డాక్టర్ శివకాంత్, సీతారామ్గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
10న మహాధర్నా
జయప్రదం చేద్దాం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న మహాధర్నాలో జిల్లాలోని వేలాదిమంది ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ విజయ్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించి మహాధర్నా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగామాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కృష్ణమోహన్, నందకిషోర్, మహేశ్వర్రెడ్డి, తానాజీ, నరేష్, యాదగిరి, కృష్ణగౌడ్, మధు, తదితరులు పాల్గొన్నారు.


