అమరచింత: ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరిట కుచ్చుటోపి పెడుతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేశ్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన డీవైఎఫ్ఐ జిల్లా 3వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత ఉద్యమమే కీలకం అంటున్నారే తప్పా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను యువశక్తి, దేశ భవిష్యత్ అంటూ ప్రసంగాల్లో పొగడటం కాకుండా వారికి శాశ్వత ఉపాధి, నాణ్యమైన విద్య, సామాజిక భద్రత, ఉద్యోగాలు కల్పించే విధానాలను అమలు చేయాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో శిక్షణ కార్యక్రమాలు ప్రకటిస్తూ.. మరోమైపు ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలను తగ్గించడం ప్రైవేటీకరణ– కాంట్రాక్టీకరణను పెంచడం ద్వారా యువత భవిష్యత్ను అనిశ్చితిలోకి నెట్టడం ఆపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామన్న హామీ గాలిలో దీపంగా మారిందన్నారు. రారష్ట్ర ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ని ప్రకటించి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు భర్తీ చేయలేకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతరం నిఘా అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసి విద్యార్థి, యువత ప్రాణాలను రక్షించాలన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు జబ్బార్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్, రాజశేఖర్, మహేష్, నాగరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


