మన్ననూర్: శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిలోని అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం పరిధిలో వన్యప్రాణుల రక్షణ కోసం రంబుల్ స్టిప్స్ (స్పీడ్ బ్రేకర్స్) ఏర్పాటు కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొంతకాలంగా అభయారణ్యంలో వివిధ రకాలైన వన్యప్రాణుల సంఖ్య ఘణనీయంగా పెరిగింది. అదే క్రమంలో ప్రధాన రహదారి గుండా అధికమైన వాహనాల రాకపోకలతోపాటు వాహనాల స్పీడ్ లిమిట్ లేకపోవడంతో తరచుగా వన్యప్రాణులు వాహనాలబారిన పడి మృత్యువాత పడుతున్నాయి. దీంతో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సరిహద్దు ప్రధాన రహదారిలో అటవీశాఖ, హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో వాహనాల స్పీడ్ లిమిట్ కోసం రంబుల్ స్టిప్స్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రదేశాలను పరిశీలించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అభయారణ్యం పరిసర ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాహనాలు గంటలకు 30 కిలో మీటర్ల వేగానికి మించి వెళ్లకూడదనే నిబంధలకు సంబంధించిన సూచికల బోర్డులను మన్ననూర్, బ్రహ్మగిరి అటవీశాఖ చెక్పోస్టుల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో అమ్రాబాద్ ఎఫ్డీఓ చంద్రప్రకాష్, ఎన్హెచ్ఏఐ అధికారి శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ సవిత, వైల్డ్లైఫ్ బయాలజిస్టు బాపురెడ్డి, ఎఫ్ఎస్ఓలు, బీఎఫ్ఓలు పాల్గొన్నారు.


