జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్స్కు యువత దూరంగా ఉండాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అన్నారు. శుక్రవారం స్థానిక డీవైఎఫ్ఐ కార్యాలయంలో డీవైఎఫ్ఐ 34వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ భవిష్యత్ను నాశనం చేస్తున్నాయన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నాయని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు లేక నిరాశ, నిస్పృహ పెరుగుతున్న పరిస్థితుల్లో కొంతమంది మాదక ద్రవ్యాలు, గంజాయి, బెట్టింగ్లకు ఆకర్షితులవుతున్నారన్నారు. యువతను నిందించడం మాత్రమే కాకుండా వారికి ఉద్యోగాలు, ఉపాధి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో ప్రిన్సిపాల్పై జరిగిన హత్య ఘటనను ప్రస్తావిస్తూ.. సమాజంలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగం, సోషల్ మీడియా ప్రభావం, యువతలో పెరుగుతున్న అసాంఘిక ధోరణులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులపై చిన్నచూపు చూస్తుందన్నారు. యువత శక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, ప్రశాంత్, ఉపాధ్యక్షులు భానుప్రసాద్, షహీద్, బాలకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, సురేష్, జిశాంత్, టోని తదితరులు పాల్గొన్నారు.


