● వారం పాటు నిరసన కార్యక్రమాలుచేపడతాం: మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): కాంగ్రెస్ ప్రభు త్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వెయ్యి మోసాలకు పాల్పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, పింఛన్ల పెంపు, ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, లేకపోతే ప్రభుత్వం అమలవుతున్న పథకాలను కూడా నిలిపివేసే ప్రమాదం ఉందని అన్నారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, నాయకులు ఆంజనేయులు, రహమాన్, శివరాజ్, నరేందర్, రాజేశ్వర్ రెడ్డి, కృష్ణయ్యగౌడ్, కరుణాకర్గౌడ్, దేవేందర్ రెడ్డి, కిషోర్ పాల్గొన్నారు.


