జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గల్ఫ్లో పని చేస్తూ స్వదేశానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో గుండెపోటుతో మృతిచెందిన గల్ఫ్ వలస కార్మికుడు ముసిరిప్ప మాసప్ప కుటుంబానికి రూ.19,01,968 బీమా సొమ్ముకు సంబంధించిన చెక్కును కలెక్టర్ ఖుష్బూ గుప్తా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అందజేశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గండీడ్ మండలం వెన్నచేడ్కు చెందిన ముసిరిప్ప మాసప్ప 15ఏళ్లుగా గల్ఫ్లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గతేడాది మే 22న స్వగ్రామానికి వచ్చి తిరిగి గల్ఫ్కు వెళ్తున్న సమయంలో విమానం ఎక్కే క్రమంలో గుండెపోటుతో మృతిచెందాడు. గల్ఫ్లో పనిచేస్తున్న సమయంలో మాసప్ప పనిచేస్తున్న కంపెనీతో కుదుర్చుకున్న బీమా ఒప్పందం మేరకు ఆయనకు సంబంధించిన రూ.19,01,968 బీమా మొత్తం మంజూరైంది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును కలెక్టర్ ఖుష్బూగుప్తా గురువారం మాసప్ప భార్య ముసిరిప్ప వెంకటమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విదేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల కుటుంబాలకు బీమా పథకాలు ఆపద సమయంలో ఆర్థిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ నిర్మల, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జితేందర్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు ప్రభాకర్రెడ్డి, బసప్ప తదితరులు పాల్గొన్నారు.


