● చెరువులు నింపడానికే ప్రాధాన్యం
● కొత్తగా తుకాలు పోయవద్దని విజ్ఞప్తి
● ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి
దేవరకద్ర/మరికల్: చెరువులను నింపడంతో పాటు భూగర్భ జలాల పెంపు కోసమే కోయిల్సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. బుధవారం ఎడమ కాల్వకు ఎమ్మెల్యే జీఎమ్మార్, కుడి కాల్వకు నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి లభ్యత లేకున్నా.. రైతులకు సాగునీటిని అందించాలనే ప్రయత్నంలో భాగంగా వారం రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందన్నారు. రైతులు కొత్తగా తుకాలు పోయొద్దని విజ్ఞప్తి చేశారు. సాధారణంగా రిజర్వాయర్లో కనీసం 1.5 టీఎంసీల నీరు ఉన్నప్పుడే సాగుకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 0.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని తెలిపారు. ఇందులో 0.6 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు నిల్వ ఉంచి మిగతా నీటిని వదలుతున్నట్లు పేర్కొన్నారు. ఉంద్యాల వద్ద రెండు పంపులను రన్ చేసి కోయిల్సాగర్కు నీటిని తరలిస్తున్నామన్నారు. వారం రోజుల తరువాత రిజర్వాయర్లో నీటి మట్టం ఎంతమేర పెరుగుతుందో పరిశీలించి అందుబాటులో ఉన్న నీటి ఆధారంగా సాధ్యమైనంత మేర రైతులకు సాగునీటిని అందించే ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఈఈ ప్రతాప్సింగ్, నాయకులు యుగంధర్రెడ్డి, వెంకటేశ్, మదన్, చందుగౌడ్, గోపాల్, భరత్, ప్రేమ్కుమార్, రాజుగౌడ్, పేట డీసీసీ ఉపాధ్యక్షుడు సూర్యమోహన్రెడ్డి, విండో అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, మండల అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి, సర్పంచ్ చెన్నయ్య, హరీష్, ఆంజనేయులు, వీరన్న, రఘు తదితరులు పాల్గొన్నారు.


