జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల విద్య అందిస్తూ భాషా నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయం నుంచి ‘వెబెక్స్’ ద్వారా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో ఆంగ్ల బోధనపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా నూతన బోధనా పద్ధతులు అవలంబించాలని, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడంతో పాటు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేలా తీర్చిదిద్దాలని సూచించారు. భయంలేకుండా ఆంగ్లంలో మాట్లాడే వాతావరణం కల్పించాలని, అభ్యసన ఫలితాలను నిరంతరం పరిశీలిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు ఉత్తమ బోధనా పద్ధతులను పరస్పరం పంచుకుంటూ విద్యార్థులను బోధనలో చురుగ్గా భాగస్వాములను చేయాలని సూచించారు. వెబెక్స్ సమావేశంలో డీఈఓ విజయకుమారి, పాల్గొన్నారు.
పింఛన్ దరఖాస్తుల ఆన్లైన్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కార్పొరేషన్ పరిధిలో కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తమ దరఖాస్తుల పరిస్థితిపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించి నేరుగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నప్పటికీ.. దరఖాస్తు స్వీకరించినట్లు రశీదు ఇవ్వకపోవడం, ఆన్లైన్ చేసినట్లు ఎస్ఎంఎస్ రాకపోవడంతో పలువురు అయోమయానికి గురవుతున్నారు. దీంతో కొందరు ఒకటికి రెండుసార్లు దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 1,177 దరఖాస్తులు అందగా.. వీటిలో వితంతు పెన్షన్కు 810, ఒంటరి మహిళ 19, దివ్యాంగు 339, చేనేత కార్మికులకు 2, కల్లుగీత కార్మికులకు 7 దరఖాస్తులు ఉన్నాయి. ఈ విషయంపై కమిషనర్ రామాంజులారెడ్డి మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు ఆన్లైన్లో పొందుపరుస్తున్నామని తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్ చేయకుండా నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పీయూలో
ప్రాంగణ ఎంపికలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో దివీస్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనగా.. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ చదువు పూర్తికాగానే ఉద్యోగం పొందడం మంచి అవకాశమన్నారు. ప్రైవేట్ సంస్థల్లో మెరుగైన వేతనాలతో ఉద్యోగాలు పొందడం ద్వారా విద్యార్థులు భవిష్యత్లో స్థిరపడవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి అర్జున్, ప్రిన్సిపాల్ ఈశ్వర్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విధానాలతో కార్మికులకు నష్టం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక విధానాలు కార్మికుల సంక్షేమానికి దోహదపడటం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ విమర్శించారు. గురువారం ఎంజీజీహెచ్ లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల సన్నాహక సమా వేశం నిర్వహించి వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే నెల 6 నుంచి 8 వరకు కరీంనగర్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలకు అధిక సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


