అలంపూర్ : పంటల సాగులో అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో సమగ్ర ఎరువుల యాజమాన్యం ముఖ్యమైంది. అభివృద్ధి చెందిన దేశాల కన్నా మన దేశంలో ఎరువుల వాడకం తక్కువగా ఉన్నప్పటికి పోషకాల సమతుల్యత సమగ్ర ఎరువుల వాడకం పాటించకపోవడం సమస్యగా మారిందని ఏడీఏ సక్రియనాయక్ పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో దేశ జనాభాకు తగ్గట్టుగా ఆహార ధాన్యాలు అవసరమవుతాయి కాబట్టి ఆహార ఉత్పత్తిలో సమతుల సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.
సమతుల ఎరువుల వాడకం :
పైరుకు కావాల్సిన పోషకాలు ఎక్కువ.. తక్కువ కాకుండా అవసరమైన మేరకు అవసరమైన సమయాల్లో అందుబాటులో ఉండే విధంగా అందించ డాన్ని సమతుల ఎరువుల వాడకం అంటారు. దీని పై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో నత్రజని వినియోగం అధికమై మిగిలిన పోషకాలను మొక్కలకు అందించడంలో రైతులు అశ్రద్ధ చేస్తున్నా రు. దీని వలన నేల ఫలదత తగ్గిపోవడం, చౌడు బారడం, పైర్లు చీడపీడలకు సులభంగా గురికావడం వంటి పరిణామాలు కనిపిస్తాయి. కనుక భూసార పరీక్షల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను సరిపడా మోతాదులో వాడాల్సి ఉంటుంది.
సమగ్ర ఎరువుల వాడకం :
రసాయన, సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా తగిన రీతిలో పైర్లకు పోషకాలు అందించడాన్ని సమగ్ర ఎరువుల వాడకంగా పేర్కొంటారు. పైరుకు సిఫార్సు చేసిన పోషక మోతాదులో మూడింట రెండు వంతులు రసాయన ఎరువుల ద్వారా ఒక వంతు సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా అందించినప్పుడు దీర్ఘకాలం పాటు భూసారం, ఫలదతతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రసాయన ఎరువుల ద్వారా ముఖ్య పోషకాలు, సేంద్రియ ఎరువుల ద్వారా అన్ని పోషకాలు కొద్ది పరిమాణంలో లభ్యమవుతాయి. జీవన ఎరువులు గాలి నుంచి నత్రజని, నేల నుంచి భాస్వరం అందించడానికి దోహదపడటమే కాక మొక్కలకు కావాల్సిన హార్మోన్లు, ఏంజైములు అందించడానికి రసాయన ఎరువుల వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించుకోవడానికి తోడ్పడతాయి.
పాడి–పంట


