వ్యక్తి ఆత్మహత్య
కోడేరు: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథకం ప్రకారం.. గ్రామానికి చెందిన మన్నె ఉపేందర్(44) ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బాధపడుతుండేవాడు. ఆదివారం తెల్లవారుమున ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య స్వర్ణ, కూతురు, కుమారుడు ఉన్నారు.
చికిత్సపొందుతూ
బాలిక మృతి
గోపాల్పేట: చికిత్స పొందుతూ బాలిక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక శనివారం మరో బాలుడు తనను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం బాలిక మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మక్తల్: బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని భూత్పుర్ గ్రామ శివారులో ఆదివారం జరిగింది. మండలంలోని సత్యవార్ గ్రామానికి చెందిన పాష( 22) వ్యాపారానికి కోళ్ల కోసం బైక్పై మక్తల్ వస్తున్నాడు. ఈ క్రమంలో మక్తల్ నుంచి ఆత్మకూర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం భూత్పూర్ రిజర్వాయర్ వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో పాషా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం వాహన డ్రైవర్ పరారైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వంగూరు: మండల పరిధిలోని మిట్టసదగోడు గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి (50) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం వ్యక్తిగత పనిపై కల్వకుర్తికి వెళ్లి శనివారం రాత్రి బైక్పై తిరిగి వస్తుండగా కోనాపూర్ గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లడంతో ఛాతి భాగంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
పాము కాటుతో
వ్యక్తి మృతి
అచ్చంపేట: అచ్చంపేట మండలం శివారు తండాకు చెందిన అమర్సింగ్ (40) ఆదివారం పాముకాటుకు గురై మరణించారు. వ్యవసాయ పనుల్లో భాగంగా పొలానికి వెళ్లగా పాముకాటు వేసింది. పాముకాటును గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఎద్దులబండి కిందపడి యువకుడి మృతి
అడ్డాకుల: మండలంలోని చిన్నమునుగల్ఛేడ్ గ్రామానికి చెందిన యువకుడు ఎద్దుల బండిపై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మమ్మ, కుర్మయ్య దంపతుల కుమారుడు విష్ణు(15) ఎద్దుల బండి తీసుకొని ఇసుక కోసం గ్రామ సమీపంలోని పెద్దవాగుకు వెళ్లాడు. బండిలో ఇసుక నింపుకొని తిరిగి వస్తుండగా రోడ్డుపై ఉన్న గుంతలో బండి టైరు పడి ఒక్కసారిగా కుదుపునకు గురి కావడంతో బండిపై ఉన్న విష్ణు ఎగిరి బండి టైరు కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడటంతో స్థానికులు చికిత్స నిమిత్తం అడ్డాకుల పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
గుడిబండలో
ఇరువర్గాల ఘర్షణ
● బతుకమ్మ చీరల పంపిణీలో వివాదం
అడ్డాకుల: మండలంలోని గుడిబండలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. 2023లో దసరా పండుగకు వచ్చిన బతుకమ్మ చీరలు పంపిణీ చేయకుండా మహిళా సంఘం భవనంలో నిల్వ చేశారు. ఈ క్రమంలో వాటిని రేషన్ డీలర్ ద్వారా మహిళలకు అందించాలని సర్పంచ్ వాకిటి లక్ష్మి నిర్ణయించి ఏపీఎం మహేష్తో అనుమతి తీసుకున్నారు. ఆదివారం చీరలు పంపిణీ చేస్తుండగా ఎంపీటీసీ మాజీ సభ్యురాలు శకుంతల అడ్డుకొని సర్పంచ్ భర్త శ్రీనివాసులుపై చేయి చేసుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి పోలీస్స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.శ్రీనివాస్ తెలిపారు.


