
ముమ్మరంగా ‘100 రోజుల ప్రణాళిక’
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో ఈ నెల 2 నుంచి ‘వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక’ ముమ్మరంగా సాగుతోంది. మున్సిపల్ శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో నిత్యం ఆయా డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి తడి, పొడిచెత్తను వేరుచేసి స్వచ్ఛ ఆటోలకే ఇవ్వాలని అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, సీజనల్ వ్యాధులు, వీధికుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బహిరంగ ప్రదేశాలు, ఓపెన్ ప్లాట్లలో చెత్తాచెదారం వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈపాటికే ఇలాంటి వారిని గుర్తించి నోటీసులు అందజేస్తున్నారు. మరోవైపు మెప్మా ఆధ్వర్యంలో స్థానిక పండ్ల దుకాణదారులు, వీధి వ్యాపారుల వద్దకు వెళ్లి కామన్ ఇంట్రెస్ట్ గ్రూపు (సీఐజీ) లో చేరాలని సూచిస్తున్నారు. దీనివల్ల బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు గురు లింగం,రవీందర్రెడ్డి, వజ్రకుమార్రెడ్డి, మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు పాల్గొంటున్నారు.