
∙బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు
ముండ్లమూరు (కురిచేడు): పెళ్లి పేరుతో ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిపై ముండ్లమూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ముండ్లమూరు ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముండ్లమూరు మండలంలోని బట్లపల్లి గ్రామానికి చెందిన మహిళకు చీమకుర్తిలోని గాం«దీనగర్కు చెందిన వ్యక్తితో 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో చట్టప్రకారం విడిపోయారు. దీంతో ఆ మహిళ బట్లపల్లి గ్రామంలోని పుట్టింటికి చేరింది. తన పెద్దమామ కుమారుడు యద్దనపూడి సుధాకర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునేందుకు ఆ మహిళ అంగీకరించింది.
కానీ, ఇరువైపుల పెద్దలు అంగీకరించకపోవటంతో వివాహం నిలిచిపోయింది. కానీ, సుధాకర్ మాత్రం ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఎలాగైనా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుందామని చెప్పాడు. ఇక్కడి పెద్దలు అంగీకరించడం లేదని, హైదరాబాద్ వెళ్లి వివాహం చేసుకుందామని చెప్పడంతో అతనితో కలిసి ఆ మహిళ హైదరాబాదు వెళ్లింది. అక్కడ ఓ గది అద్దెకు తీసుకుని మంగళసూత్రం, మెట్టెలు తెచ్చి చూపించి గుడికి వెళ్లి పెళ్లిచేసుకుందామని చెప్పాడు. కానీ, మంచి రోజు కాదని, మంచి రోజు చూసి చేసుకుందామని చెప్పి తిరిగి రూంకు తీసుకొచ్చాడు. రూంలో మోజు తీర్చుకున్నాడు.
ఊరు వెళ్లి పెళ్లి చేసుకుందామంటూ తిరిగి ఒంగోలు తీసుకొచ్చాడు. తన బంధువుల ఇంట్లో ఉంచి తల్లిదండ్రులు, బంధువులకు జరిగిన విషయం చెప్పాడు. వారంతా కలిసి గత ఏప్రిల్ 30న వివాహం చేయాలని నిర్ణయించి ఆ మహిళను ఆమె పుట్టింటికి పంపారు. ఆ తర్వాత ఏమైందోఏమోగానీ వివాహం చేసుకునేది లేదని, నీకు దిక్కున్నచోట చెప్పుకోమని, మళ్లీ ఫోన్ చేస్తే చంపేస్తానంటూ సుధాకర్ బెదిరించాడు. ఆ మేరకు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. సుధాకర్ను అతని తల్లిదండ్రులు, అన్న, మేనమామ దాచిపెట్టారని, సుధాకర్తో పాటు వారిపై కూడా చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.