
పథకం జాబితాలో తల్లికి దక్కని స్థానం
నంద్యాల జిల్లా పాములపాడులో పదుల సంఖ్యలో తండ్రుల పేర్లు
పాములపాడు: ఇటీవల విడుదల చేసిన తల్లికి వందనం అర్హుల జాబితాలో తండ్రుల పేర్లు దర్శనమిస్తున్నాయి. ఈ జాబితా చూసిన వారు అవాక్కవు తున్నారు. నంద్యాల జిల్లా పాములపాడు గ్రామానికి సంబంధించి ఇటీవల వెల్లడించిన జాబితాలో ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. మొత్తం 724 మంది పేర్లతో జాబితా ప్రదర్శించగా, ఇందులో 20 మంది లబ్దిదారులు తండ్రి పేర్లతో దర్శనమిచ్చాయి. మరో విచిత్రమేమిటంటే జాబితాలో వరుస నెం 93, 96 లో కేవలం ’ న’ అనే అక్షరం పేరుతో లబ్ధిదారుని పేరుగా చేర్చారు.
ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాల్లో తేడాలు
లబ్దిదారులకు సంబంధించిన జాబితాలో ఆధార్, బ్యాంకు ఖాతాల నంబర్లలో వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. దీంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తమ ఖాతాల్లో పథకం నగదు జమకాలేదని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి హడావుడి లేకుండా నేరుగా తొలిరోజే అమ్మఒడి నగదు పడిందని, అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
పేరు మారింది.. డబ్బులు రాలేదు
తల్లికి వందనం జాబితాలో నా పేరు లేదు. నా భర్త నాగలోకేశ్ పేరు వచ్చింది. ఆధార్ నంబరు కూడా ఆయనదే ఉంది. పథకం నగదు ఎవరి బ్యాంకు ఖాతాలో పడతాయో తెలీదు. స్కూల్లో మాత్రం నా వివరాలనే ఇచ్చాను. ఇప్పుడేమో జాబితాలో ఇలా. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – బాలీశ్వరమ్మ, పాములపాడు, నంద్యాల జిల్లా
అర్థం కాలేదు
తల్లికి వందనం అర్హుల జాబితాలో నా భార్య పి. వరలక్ష్మి పేరు లేదు. ఎందుకు రాలేదో అర్థం కాలేదు. అనర్హుల జాబితాలోనూ లేదు. తీరా చూస్తే పిచ్చిగుంట్ల శివక్రిష్ణ అని నాపేరు వచ్చిoది. ఆధార్ నంబరు నాదే ఉంది. తల్లికి వందనం నగదు విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎవరి అకౌంట్లోనూ జమ కాలేదు. – పిచ్చిగుంట్ల శివక్రిష్ణ, పాములపాడు