
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు ఆర్అండ్ఆర్ కింద కేటాయించే స్థలాన్ని అన్ని వసతులతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉదండాపూర్ రిజర్వాయర్ కింద వల్లూరు, ఉదండాపూర్, తుమ్మలకుంట తండా, రేగడిపట్టి తండా, చిన్నగుట్ట తండా, శామగడ్డ తండా, ఒంటిగుడిసె తండా, పోలేపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు, అవార్డు అందుకున్న వారందరికీ పునరావాసం కింద 300 గజాల స్థలం చొప్పున ఇచ్చే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడ నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ స్కూల్, అంగన్వాడీ, ఫంక్షన్హాల్ వంటి ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మోహన్రావు, స్పెషల్ కలెక్టర్ మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తాం
చిన్నచింతకుంట: రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతుల ఫిర్యాదులను వెంటనే విచారణ చేపట్టి పూర్తి వివరాలతో ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. రైతులు ఎలాంటి సమస్యలున్నా సదస్సులో ఫిర్యాదు చేస్తే తక్షణ పరిష్కారం దొరికే అవకాశం ఉందని తెలిపారు.
పాఠాలు బోధించిన కలెక్టర్
కలెక్టర్ విజయేందిర ఉంద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాసేపు విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, మౌలిక వసతులు, పరిసరాలు, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు.బాగా చదివి భవిష్యత్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. ఆమె వెంట తహసీల్దార్ ఎల్లయ్య, ఆర్ఐ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.