విశేషాలంకరణలో రామలింగేశ్వరస్వామి
అడ్డాకుల: కందూర్ శివారులోని శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయంలో ఉగాది సందర్భంగా బుధవారం ప్రధాన ఆలయంలోని శివలింగాన్ని అర్చకులు రకరకాల పూలు, పండ్లతో విశేషాలంకరణ నిర్వహించారు. అంతకు ముందు శివలింగానికి విశేష అభిషేకం చేశారు. ఆలయంలో స్వామివారి బ్రహోత్సవాలు, జాతరను విజయవంతంగా నిర్వహిస్తున్న అర్చకులు, నిర్వాహకులకు పండగను పురస్కరించుకుని నూతన వస్త్రాలను అందజేశారు. ఇదిలా ఉండగా పండగ సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయానికి వచ్చిన భక్తులు కోనేరులో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం పరిసరాల్లోని కల్పవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కాగా జాతరను శ్రీరామనవమి వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వి.శ్రీకాంత్, ఆలయ చైర్మన్ రమేష్గౌడ్, ఈఓ రాజేశ్వరశర్మ, ఆలయ ఉద్యోగి అనంతసేన్రావు, అర్చకులు ఉన్నారు.