● ఎస్పీ శబరీష్
బయ్యారం: నేర రహిత సమాజం కోసం ప్రతీ ఇల్లు ఒక పోలీస్స్టేషన్ కావాల్సిన అవసరం ఉందని ఎస్పీ శబరీష్ అన్నారు. మండలంలోని సంతులాల్పోడుతండాలో శుక్రవారం రాత్రి మన ఊరు–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబం తమ కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు. తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించి, చెడు మార్గం వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపొద్దని హెచ్చరించారు. గంజాయి, గుడుంబా రహిత గ్రామాలుగా మార్చేందుకు ప్రజలు తమకు సహకరించాలన్నారు. మంచి సమాజ నిర్మాణానికి అందరం కలిసి పనిచేద్దామన్నారు. అనంతరం సర్పంచ్ మణి ద్విచక్ర వాహనదారుల కోసం తెప్పించిన 15 హెల్మెట్లను ఎస్పీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, గార్ల–బయ్యారం సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్బాబు, కొత్తపేట సర్పంచ్ ప్రవీణ్నాయక్, సొసైటీ డైరెక్టర్ భాస్కర్రావు, ఉపసర్పంచ్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.


