మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఈనెల 8న జరిగిన ప్రజావాణిలో ధరంసోతు సీతారాంనాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించామని డీఏఓ సత్యనారాయణమూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాబునాయక్ తండాలో మూసివేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ అధికారులు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు భాగాస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, నోటుబుక్స్ అందజేస్తున్నామన్నారు. పాఠశాలలో 15మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని, ఉపాధ్యాయులు బడిబాటలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులు మైస శ్రీనివాసులు, సీఎంఓ సురేష్, ఏఎంఓ వెంకటేశ్వర్లు, జీసీడీఓ గాయత్రి, ఉపాధ్యాయులు సిరినాయక్, ప్రతిభ, భోజన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


