● ల్యాబర్తిలో ఘటన
వర్ధన్నపేట: ఆస్తి తగాదా నేపథ్యంలో వదినపై మరిది గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తిలో చోటుచేసుకుంది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాధితుడు సూరారపు నిరంజన్కు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వీరికి ఉన్న భూమి మూడు సమ భాగాలుగా హద్దులు పెట్టి పంపకాలు చేసుకోవాలని గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటున్న క్రమంలో తమ్ముడు నాగరాజుకు ఎక్కువ ఇంటి స్థలం, అదే విధంగా వ్యవసాయ భూమి కావాలని గత సంవత్సరం నుంచి తగాదాలు జరుగుతున్నాయి. కాగా, భూమికి హద్దులు పెడితే చంపుతామని సోమవారం నిరంజన్ భార్య కవితను బెదిరించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కవిత ఇంటికి వస్తుండగా నాగరాజు గొడ్డలితో దాడికి పాల్పడగా ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేసి వరంగల్ ఎంజీఎం తరలించారు. ఈ ఘటనపై నిరంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


