జనగామలో నకిలీ బంగారం ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

జనగామలో నకిలీ బంగారం ముఠా అరెస్ట్‌

Jun 6 2026 12:59 AM | Updated on Jun 6 2026 12:59 AM

జనగామ: నకిలీ బంగారాన్ని విక్రయించేందుకు యత్నించిన నలుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. పట్టణ పోలీస్టేషన్‌లో శుక్రవారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్వర్ణభారతి కాలనీ కొత్తరోడ్డుకు చెందిన తురుక శివయ్య, ఆంజమ్మ, విజయవాడకు చెందిన తన్నీరు గంగరాజు, తన్నీరు అంకమ్మ 10 రోజుల క్రితం జనగామకు వచ్చి గ్రేయిన్‌ మార్కెట్‌ ఏరియాలో కొయ్యడ కృష్ణ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అదే ఇంటి పక్కన ఉన్న డబ్బాలో కిరాణం షాప్‌ నిర్వహిస్తున్న చింతకాయల హేమలతను పరిచయం చేసున్నారు. తాము జనగామ రైల్వే ట్రాక్‌ దగ్గర పనిచేస్తున్న క్రమంలో బంగారు బిళ్లలు దొరికాయని, బంగారు బిస్కెట్ల విలువ సుమారు రూ.పది లక్షల వరకు ఉంటుందని, ప్రస్తుతం రూ.ఐదు లక్షలు ఇస్తే బిస్కెట్లు ఇస్తామని చెప్పడంతో నమ్మింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన బాధితురాలి తమ్ముడు రాజు బిస్కెట్లను చూసి నకిలీగా గుర్తించాడు. విషయం తెలుసుకున్న నేరస్తులు గుట్టుచప్పుడుకాకుండా పారిపోయేందుకు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని అదుపులోకి తీసుకుని, విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి రెండు నకిలీ బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు నర్సయ్య, ఎండీ సాల్మన్‌, కానిస్టేబుళ్లు బూడిద కరుణాకర్‌, కృష్ణ, ఎ.రమేష్‌ను సీపీ అభినందించారు.

రెండు నకిలీ బంగారం బిస్కెట్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన

సీఐ సత్యనారాయణరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement