తొర్రూరు: జిల్లాలో ఓ వైపు భానుడి భగభగలు.. మరో వైపు కూరగాయల ధరల సెగలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. మార్కెట్కు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదివరకే పెరిగిన వంటగ్యాస్ ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు కూరగాయల ధరల రూపంలో భారం పడుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే దాదాపు అన్ని రకాల కూరగా యలు, ఆకుకూరల ధరలు దాదాపు రెట్టింపు కావడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
నాణ్యత కరువు..
విపరీతమైన ఎండల కారణంగా సాగునీటి వనరులతో పాటు భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలకు నీరందక తోటలు ఎండిపోతున్నాయి. దీనికి తోడు రవాణా ఖర్చులు పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధాన పట్టణాలు, గ్రామాల్లోని రైతులు కూరగాయలను పెద్దగా మార్కెట్లకు తీసుకురావడం లేదు. జిల్లాలో గతేడాది 3,320 ఎకరాల్లో కూరగాయలు సాగు చేయగా.. ఈ ఏడాది 3 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. 320 ఎకరాల్లో సాగు తగ్గింది. దీంతో కూరగాయల కొరత ఏర్పడింది. ఎండకు కాత, పూత రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. అక్కడక్కడ పండిన కూరగాయలు భానుడి దెబ్బకు పాడవుతున్నాయి. హోల్సేల్ వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. వీటిల్లో నాణ్యత ఉండటం లేదు.
వేసవిలో కొండెక్కిన కూరగాయల ధరలు
సాగు తగ్గడమే కారణం
సామాన్యులపై అధిక భారం
ధరలు ౖపైపెకి..
గత నెలలో టమాట కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పలకగా ప్రస్తుతం ఏకంగా రూ.60కి చేరింది. వంటల్లో తప్పనిసరిగా వాడే టమాట ధర ఇలా పెరగడంతో గృహిణులు ఆందోళన చెందుతున్నారు. బీరకాయ కిలో రూ.70, కాకర రూ.80, గోరు చిక్కుడు రూ.60, వంకాయ రూ.50కి అమ్ముతున్నారు. సొరకాయ ఒక్కటి రూ.20–30 పలుకుతోంది. క్యారెట్, దొండ కిలో రూ.50కి విక్రయిస్తున్నారు. కేవలం అదొక్కటే కాదు.. మిగిలిన వాటి పరిస్థితి కూడా అలాగే ఉంది. వంటలకు రుచి, సువాసన ఇచ్చే కొత్తిమీర ధర ప్రస్తుతం చుక్కలను తాకుతోంది. మార్కెట్లో చిన్న కొత్తిమీర కట్ట కూడా రూ.20 పెట్టినా రావడం లేదు. కీర, నిమ్మకాయ ధరలు సైతం బాగా పెరిగాయి.


