కేసముద్రం: తెలంగాణలో భూస్వాముల చేతుల్లో ఉన్న 10లక్షల ఎకరాల భూములను అర్హులైన పేదలకు ప్రభుత్వం పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధి హరిహర గార్డెన్లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూస్వాముల ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాల వైఖరి మార్చుకుని పేదలకు భూములను పంచాలని, జూన్ చివరివారంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పేదలే భూములను వెలికితీసి, సంఘం ఆధ్వర్యంలో పంచే కార్యక్రమం చేపడుతారన్నారు. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. భూమి, కూలీ, ఉపాధి రక్షణకు ప్రజలంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘం జిల్లా నాయకుడు గొడిశాల వెంకన్న ముందుగా సంఘం జెండాను ఆవిష్కరించారు. సంఘం ఉపాధ్యక్షుడు ఎండి.యాకూబ్, బాణాల రాజన్న మంజుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సాదుల శ్రీనివాస్, ఆకుల రాజు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న, కవిత, అశోక్, నక్క సైదులు, వెంకటేశ్వర్లు, సారయ్య, కావటి నర్సయ్య, యాకూబ్రెడ్డి, నీరుటి జలేందర్, శ్రీశైలం, జయరాజ్, మోడెం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య


