ఇనుగుర్తి: అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మండలంలోని చిన్ననాగారంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 23 ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం సామూహిక గృహప్రవేశాలు చేయించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రతీ పేదవాడికి అందిస్తుందన్నారు. సాగు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనతో పాటు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇనుగుర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మండలంలోని ప్రతీ గ్రామానికి అదనపు నిధులు తీసుకొచ్చి రోడ్లు, డ్రెయినేజీలు, విద్యా, వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తామని చెప్పారు. ఒకేసారి 23మంది లబ్ధిదారులు తమ కుటుంబాలతో కలిసి కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందని సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల లబ్ధిదారులు అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ పార్థసారథి, ఏఈ స్నేహ, సర్పంచ్ చెడుపాక సుజాత యాకన్న, మహబూబాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి రమేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీష్, జిల్లా నాయకుడు అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్
చిన్ననాగారంలో 23ఇళ్ల గృహప్రవేశాలు


