రఘునాథపల్లి: ఈత నేర్చుకుంటున్న వారిని చూసి సరదాగా బావిలో దూకిన ఓ యువకుడు నీట మునిగి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం మండలంలోని గోవర్ధనగిరిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏడేళ్ల క్రితం మహేందర్ (35) అనే యువకుడు దారి తప్పి గోవర్ధనగిరి దర్గా వద్ద లారీ దిగాడు. నాటి నుంచి దర్గా వద్దే ఓ వ్యక్తి వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో దర్గా పూజారి సయ్యద్పాషా కుమారుడు తౌసిఫ్కు ఈత నేర్పించేందుకు గ్రామ శివారులోని పటేల్ బావి వద్దకు వెళ్లారు. వారితో మహేందర్ కూడా వెళ్లాడు. గ్రామానికి చెందిన యువకులు బావిలో ఈత నేర్చుకుంటుండగా ఒ డ్డున ఉన్న మహేందర్ ఇంతేనా ఈతంటే చేతులు, కాళ్లు ఊపితే సరిపోతుంది కదా అంటూ అకస్మాత్తుగా బావిలో దూకాడు. అయితే, ఈత రాక పోవడంతో నీటిలో మునిగిపోయాడు. కొంత సేపటి వరకు పైకి రాకపోవడంతో అక్కడున్న వారు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, అ గ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని బా విలో మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించారు. అయితే బావిలో నీరు పుష్కలంగా ఉండడం, లోతు ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో గాలింపు చర్యలు ఫలించలేదు. మృతదేహాన్ని సోమవారం ఉదయం వెలికి తీసేందుకు చర్యలు కొనసాగిస్తామని ఎస్సై తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రాణాలు కోల్పోయిన యువకుడు
గోవర్ధనగిరి గ్రామంలో విషాదం
మృతదేహం కోసం రాత్రంతా గాలింపు


