లండన్‌లో వరంగల్‌ విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

లండన్‌లో వరంగల్‌ విద్యార్థిని ఆత్మహత్య

May 25 2023 7:32 AM | Updated on May 25 2023 7:59 AM

- - Sakshi

వరంగల్: లండన్‌ బ్లూమ్స్‌ బెర్రీ ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న నగరానికి చెందిన బసవరాజ్‌ శ్రావణి(27) ఈ నెల 10న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కాగా, ఆమె మృతదేహం గురువారం ఉదయం హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని బంధువులు తెలిపారు. వరంగల్‌ నగరంలోని పోచమ్మ మైదాన్‌ ప్రాంతానికి చెందిన బసవరాజ్‌ విజయ రమేష్‌ దంపతుల కూతురు శ్రావణి ఉన్నత విద్య నిమిత్తం లండన్‌ వెళ్లింది.

తండ్రి వృత్తిరీత్యా లారీడ్రైవర్‌, తల్లి గృహిణి. తమ ఉన్నత చదువుల కోసం సొంత ఇంటిని అమ్మిన ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో శ్రావణి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని బంధువులు తెలిపారు.

లండన్‌లోని వరంగల్‌ ఎన్నారై ఫోరం బృందం అధ్యక్షుడు శ్రీధర్‌ నీల, ఫౌండర్‌ కిరణ్‌ పసునూరి, జాయింట్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ బిట్ల, ఉమెన్‌ వింగ్‌ సెక్రెటరీ మేరీఏలు ఇండియా ఎంబసీ అధికారులతో సంప్రదించి మృతదేహాన్ని భారతదేశానికి పంపించినట్లు పేర్కొన్నారు. శ్రావణి కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement