● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు(సెంట్రల్): ఉరుకుందకు కుప్పగల్లు, కోసిగి నుంచి డబుల్ లేన్ రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని ఆర్అండ్బీ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన కార్యాలయం నుంచి ఉరుకుంద ఆలయంలో జరుగుతున్న శ్రావణ మాస ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై దేవాదాయ, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భక్తులకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలన్నారు. భక్తులకు 24 గంటలపాటు వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. కుప్పగల్లు–ఉరుకుంద సింగిల్ లేన్ రహదారి మరమ్మతులు వెంటనే చేయాలన్నారు. ఆలయానికి శాశ్వతంగా నీటి సరఫరా కోసం పైప్లైన్ ఏర్పాటు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, ఎస్ఈ శైలేశ్వర్, ఆదోని ఆర్డీఓ అరుణా దేవి, ఉరుకుంద ఆలయం ఈఓ వాణి పాల్గొన్నారు.


