ఎల్నినో కారణంగా తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం కనిపించడం లేదు. తీర గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నది ఒట్టిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు చెలమలు తవ్వుకొని నీటిని తెచ్చుకొని గొంతు తడుపుకుంటున్నారు. ఒడ్డున తవ్విన చెలమల్లో నీరు రావడం లేదని, నదీ గర్భంలోకి వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు.
నందవరం : తుంగభద్ర నది ఒట్టిపోవడంతో తీర ప్రాంత ప్రజలు బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు. నదికై రవాడి, గంగవరం, జొహరాపురం, పెద్దకొత్తిలి, చిన్నకొత్తిలి, నాగలదిన్నె, గురజాల, రాయచోటి తదితర గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నదిలో చెలమలు తవ్వుకొని తాగునీరు తెచ్చుకుంటున్నారు. నదిలో అర కిలోమీటర్ దూరం వెళ్లి చెలమల్లోని నీటిని తెచ్చుకుంటున్నట్లు నాగలదిన్నె, గురజాల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జొహరాపురం, పెద్దకొత్తిలి గ్రామాలకు నెదర్లాండ్ స్కీమ్ ద్వారా నది నీటి శుద్ధి చేసి సరఫరా చేసేవారు. అయితే నదిలో నీళ్లు లేకపోవడంతో ఆయా గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హొస్పేట్ వద్ద తుంగభద్ర డ్యాంలో 94 టీఎంసీలు నీరు ఉన్నప్పటికీ నదికి నీటిని వదలకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒట్టిపోయిన తుంగభద్ర నది
తీర ప్రాంత గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి
నదిలో చెలమలు తవ్వి
తెచ్చుకుంటున్న జనం
పశువుల దాహం తీర్చేందుకూ
తప్పని అవస్థలు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు


