● జిల్లాలో 86.89 శాతానికి చేరిన
ఎన్యుమరేషన్ ఫాంల డిజిటైజేషన్
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో శనివారం పోలింగ్ బూత్ల్లో నిర్వహించిన సర్ ప్రత్యేక క్యాంపులకు ఓటర్ల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లాలోని 2,203 పోలింగ్ బూత్ల పరిధిలో బీఎల్ఓల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులను నిర్వహించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించిన క్యాంపులకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎన్యుమరేషన్ ఫాంలను స్వీకరించడం, పూరించిన ఫాంలను అందజేశారు. ఒక్క శనివారం మాత్రమే దాదాపు 11.33 శాతం ఎన్యుమరేషన్ ఫాంల డిజిటైజేషన్ పూర్తయింది. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు డిజిటైజేషన్ ప్రక్రియ 86.89 శాతానికి చేరుకుంది. కర్నూలు జిల్లాలో మొత్తం 20,86,119 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 20,84,815 మంది ఎన్యుమరేషన్ ఫాంలు పొందారు. వీరిలో 18,12,625 మంది ఓటర్లు తమ ఫాంలను బీఎల్ఓలకు అందించారు. ఇక తీసుకున్న ఫాంలలో 2,72,190 సమర్పిస్తే.. నూటికి నూరు శాతం ఫాంల డిజిటైజేషన్ పూర్తవుతుంది. ఇదిలాఉంటే 1304 మంది మాత్రమే ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ ఫాంలను పొందలేదని తెలుస్తోంది. కాగా, ఫామ్ల డిజిటైజేషన్లో కోడుమూరు 95.95 శాతంతో మొదటి స్థానం.. పాణ్యం నియోజకవర్గం చివరి స్థానంలో ఉంది. ఆదివారం కూడా ప్రత్యేక క్యాంపులను నిర్వహించనున్నారు.
టీడీపీ నాయకుల హల్చల్
జిల్లాలో శనివారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపుల్లో టీడీపీ బీఎల్ఏలు హల్చల్ చేశారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరులోని పలు పోలింగ్ బూత్ల పరిధిలో టీడీపీ బీఎల్ఏలు వచ్చిన ఓటర్ల వివరాలను సేకరించి ఐ టీడీపీ యాప్లో నమోదు చేసుకున్నారు. అయితే అధికారులు వారిని ఎక్కడా వారించకపోవడం గమనార్హం.


