జిల్లా పరిషత్ చైర్మన్
కర్నూలు(అర్బన్): స్వాతంత్య్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు చూపిన తెగువ, చేసిన పోరాటం, త్యాగం తెలుగుజాతి మరువలేనిదని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్లోని మినీ సమావేశ భవనంలో అల్లూరి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా వీరుడు అల్లూరి సీతారామరాజు అని చెప్పారు. ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు ఎల్లప్పుడు స్మరించుకోవాలన్నారు. జెడ్పీ ఇన్చార్జీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 1897 జూలై 4న అల్లూరి సీతారామరాజు జన్మించారన్నారు. చిన్నతనం నుంచే దేశభక్తి భావాన్ని పెంపొందించుకున్న అల్లూరి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. జెడ్పీ పరిపాలనాధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యర్రబోతుల పాపిరెడ్డి


