శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి క్షేత్రం కన్నడ భక్తులమయమైంది. ఐదు రోజుల పాటు జరుగనున్న మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపె దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అన్ని విభాగాల అధికారులతో పలుమార్లు సమావేశాన్ని నిర్వహించారు. ఉగాది మహోత్సవాలు సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివ సంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ తదితర పూజలు నిర్వహిస్తారు. అలాగే భ్రమరాంబాదేవి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం, అంకురార్పణ, అగ్రిప్రతిష్ఠాపన, నిత్యహవనములు జరిపిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారం, స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో 18న వీరాచార విన్యాసాలు గగుర్పాటు కలిగిస్తాయి. 19న ఉగాది రోజు పంచాంగ శ్రవణం, రథోత్సవం, అమ్మవారికి రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారం చేపట్టనున్నారు. 20వ తేదీన పూర్ణాహుతి, అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. ఆరోజు భ్రమరాంబాదేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు.
కన్నడ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ప్రతిరోజు అమ్మవారికి విశేష
అలంకారం, స్వామిఅమ్మవార్లకు
విశేష వాహనసేవలు
భక్తులందరికీ స్వామివారి
అలంకార దర్శనం


