కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధికి ఒక ప్రణాళికాబద్ధమైన ప్రజాస్వామ్య వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవపూజ ధనుంజయ ఆచారి, ఎన్ శాంతికుమార్ అన్నారు. మంగళవారం స్థానిక బీసీ భవన్లో విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన విశ్వ బ్రాహ్మణ, కుల వృత్తి సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముందుగా బ్రహ్మశ్రీ గానాల రామమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ, కానిపాకం వినాయక స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ రాజ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ కులంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులను గుర్తించలేని స్థితి ఉందన్నారు. 2024 ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే హామీలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో నాయకులు గిడ్డయ్య ఆచారి, రమేష్ ఆచారి, తిమ్మయ్య ఆచారి, బ్రహ్మయ్య ఆచారి, ప్రణదీప్ ఆచారి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.


