● కలెక్టరేట్ ప్రాంగణంలోని
ఆప్కో షోరూము మూత
● చంద్రబాబు ప్రభుత్వం
ఏర్పాటు తర్వాత తెరుచుకోని
రెండు షోరూములు
● చేనేత వస్త్రాల ఉత్పత్తి లేక
అంధకారంలో ఆప్కో
● ఉగాది ముంగిట వెలవెలబోతున్న
ఆప్కో షోరూములు
● రెండేళ్లుగా కొత్త స్టాక్ సరఫరాలో
చేతులెత్తేసిన వైనం
● కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో
మూతపడిన ఆప్కో గోదాము
● ఐదు నెలలుగా వేతనాలు అందక
సిబ్బంది ఇక్కట్లు
● చేనేత సహకార సంఘాలకు
ఎన్నికల నిర్వహణలోనూ వైఫల్యం
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆప్కో పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆప్కో దివాళా దిశగా పయనిస్తోంది. ఏడాదికొకటి చొప్పున ఆప్కో షోరూములు మూతపడుతున్నాయి. చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రోత్సాహం కరువైంది. చేనేత సహకార సంఘాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేసే ఆప్కోలో చీకటి రాజ్యమేలుతోంది. దసరా, ఉగాది హిందువులకు అతి పెద్ద పండగలు. ఈ సారి ఉగాదితో పాటే రంజాన్ కలసి వచ్చింది. అయితే ఆప్కో షోరూములు మాత్రం వెలవెలబోతున్నాయి. హుందాతనానికి, మన్నికకు చేనేత వస్త్రాలు పెట్టింది పేరు. వ్యవసాయ రంగం తర్వాత చేనేతకు అంతటి ప్రాధాన్యత ఉంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేడు చేనేత, ఆప్కో మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేత వస్త్రాల మార్కెటింగ్కు అనేక చర్యలు చేపట్టింది. కొత్త షోరూములను ఏర్పాటు చేయడంతో పాటు ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించింది. ప్రత్యేక స్కీమ్ల ద్వారా ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంది. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల వ్యాపారం పెంచేందుకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం విశేషం. ప్రతి నెలా ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొని షోరూములకు సరఫరా చేయడం జరిగింది. పండుగలకు నెల రోజుల ముందే కొత్త డిజైన్లతో ఆప్కో షోరూములు కళకళలాడేవి. అయితే ప్రస్తుతం రెండేళ్లుగా ఇటు చేనేత, అటు ఆప్కోలో నిస్తేజం నెలకొంది.
మూతపడుతున్న షోరూమ్లు
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆప్కో షోరూములు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోనే కర్నూలు పాత బస్టాండులోని శ్రీనివాస క్లాత్ మార్కెట్లో ఉన్న ఆప్కో షోరూము మూత పడింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలే ఆప్కోపై ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయించినట్లు సమాచారం. తాజాగా కలెక్టరేట్ ప్రాంగణంలోని చేనేత బజారులో ఉన్న ఆప్కో షోరూము మూతపడటం ఆందోళన కలిగించే విషయం. కలెక్టరేట్కు నిత్యం వందలాది మంది సందర్శకులు వస్తుంటారు. కలెక్టరేట్ ప్రాంగణంలో 35 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఇంతటి కీలకమైన ప్రాంతంలోని ఆప్కో షోరూము మూతపడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.


