కర్నూలు(సెంట్రల్): అన్నదాతలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని జేసీ బ్యాంకర్లతో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర ప్రాధాన్యత రంగాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలన్నారు. కౌలు రైతులకు కూడా నిబంధనల మేరకు రుణాలు ఇవ్వాలని, పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. జిల్లా ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించాలన్నారు. మార్చి 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న డిజిటల్ పేమెంట్స్ అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం ఆర్బీఐ రూపొందించిన డిజిటల్ లావాదేవీల పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎల్డీఎం రామచంద్రరావు, ఆర్బీఐ లీడ్ బ్యాంకు ఆఫీసర్ రామకృష్ణ, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, కెనరా బ్యాంకు డివిజినల్ మేనేజర్ గౌతమ్, సీబీఆర్ ఎస్ఈటీఐ డైరెక్టర్ పుష్పకుమార్, జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మి పాల్గొన్నారు.


