● సరంజామాతో తరలివచ్చిన మహారాష్ట్ర బృందం
ఆత్మకూరురూరల్: ఏ చిన్న వస్తువు కావాలన్నా రోడ్డు పాయింట్కు రావాలంటే ఆరేడు కి.మీ అడవిలో నడవాల్సిందే.. అలాంటి చోట 16 ఏళ్లుగా ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్లే కన్నడ పాదయాత్రికుల కోసం అన్నదానం కొనసాగించడం అంటే ఒక యజ్ఞంతో సమానమే. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచ్చలకరంజికి చెందిన శ్రీశైల మల్లికార్జున మల్టీపర్పస్ ట్రస్ట్కు చెందిన వలంటీర్లు అన్ని సంబారాలతో సోమవారం నల్లమలకు చేరుకున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ నాగలూటిలో ఉన్న వీరభద్రాలయం వద్ద వారు ఏటా ఉగాది ఉత్సవాల సందర్భంగా 10 రోజుల పాటు 24 గంటలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ట్రస్ట్ అధ్యక్షులు మాలగొండ్ల పాటిల్, కార్యదర్శి పాండుతో పాటు 200 మంది స్వచ్ఛంద సేవకులు ఈ అన్నదాన క్రతువులో పాల్గొనేందుకు వచ్చారు. ఈ ఏడాది భక్తుల కోసం చపాతీలు కూడా అందివ్వనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇందుకోసం రోజుకు 50 వేల చపాతీలు తయారు చేసే మిషన్ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఐదు భారీ లారీల్లో కావలసిన కిరాణ సరుకు కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు.


