● జేసీకి విన్నవించిన దివ్యాంగురాలు
కర్నూలు(సెంట్రల్): పక్షపాతం వచ్చి కాళ్లు, చేతులను కదపలేని స్థితిలో ఉన్నానని, పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ను ఆదోని మండలం సదాపురానికి చెందిన బి.నర్సమ్మ అనే మహిళ వేడుకున్నారు. రెండేళ్లుగా పింఛన్ మంజూరు కాకపోవడంతో అద్దె కారులో ఆమెను సోమవారం కుటుంబ సభ్యులు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తీసుకొచ్చారు. అయితే ఆమె దుస్థితిని చూసిన జాయింట్ కలెక్టర్ కారు దగ్గరకే వెళ్లి అర్జీ తీసుకున్నారు. కాగా, ప్రజల ఫిర్యాదులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పరిష్కరించాలని జేసీ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. సరైన ఎండార్స్మెంట్ ఇస్తేనే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని, లేదంటే మళ్లీ అర్జీల రూపంలో వస్తూనే ఉంటాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్పీడీ చిరంజీవి పాల్గొన్నారు.


