కర్నూలు: మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో శనివారం మెగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది మొత్తం దాదాపు 240 మంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. దాదాపు 870 మంది సమస్యాత్మక వ్యక్తులు, ఇళ్లు, 345 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 35 లిక్కర్ బాటిళ్లను సీజ్ చేసి పత్తికొండలో సమస్యాత్మక వ్యక్తిపై బైండోవర్ కేసు నమోదు చేశారు. నాటుసారా తయారీ, విక్రయాల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీల్లో భాగంగా వెయ్యి లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊట, 300 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉంటే కర్నూలు నగరంలో సమస్యాత్మక ప్రాంతమైన బంగారుపేటలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు, డీఎస్పీ బాబు ప్రసాద్, ఏఈఎస్ రామకృష్ణా రెడ్డితో పాటు సీఐలు నాగరాజరావు, శేషయ్య, చంద్రబాబు నాయుడు, తేజమూర్తి, పార్థసారధి, మన్సూరుద్దీన్, ఎకై ్సజ్ సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు, ఈగల్ టీమ్ ఎస్ఐ సుజన్ కుమార్ తదితరులు బృందాలుగా ఏర్పడి కేసీ కెనాల్ గట్టుపై విస్తృత తనిఖీలు చేపట్టారు. సారా బట్టీలను ధ్వంసం చేసి 350 లీటర్ల బెల్లం ఊట, 50 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు.


