● డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్
డాక్టర్ చంద్రశేఖర్
కర్నూలు (హాస్పిటల్): ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీలో వస్తున్న నైపుణ్యాలను యువ వైద్యులు పెంపొందించుకోవాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో గురువారం సాయంత్రం 2020 బ్యాచ్ ఎంబీబీఎస్ వైద్య విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. యువ వైద్యులు సమాజానికి ఆశాకిరణాలుగా నిలవాలని ఆకాంక్షించారు. వైద్యుని వద్దకు ఎంతో ఆశతో వచ్చే రోగి ఒక కేసు కాదని, అతను ఎంతో నమ్మకంతో మీ వద్దకు వచ్చే సగటు మనిషే అని మరువవద్దని తెలిపారు. కోటి ఆశలతో తమ పిల్లలను వైద్య విద్యలో చదివించేందుకు తల్లిదండ్రులు అహర్నిశలు కృషి చేస్తారని, వారి నమ్మకాన్ని పిల్లలు నిలబెట్టాలని సూచించారు. వైద్యవిద్యలో నూతన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నారు. కృత్రిమ మేథస్సుతో జీనోమిక్స్ చేసుకోవాలని, రీసెర్చ్ రంగంలో అధిక ప్రాధాన్యతనివ్వాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి వైద్య విద్యార్థికి విజ్ఞానం, నైపుణ్యం, మానవత్వం కలసినప్పుడే నిజమైన వైద్యసేవలు సమాజానికి అందుతాయన్నారు. అనంతరం ఐసీఎంఆర్, యూజీఎస్ఆర్ఎస్ ప్రాజెక్టులలో పాల్గొనే యూజీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యపరీక్షల్లో రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుధాకర్, ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ హరిచరణ్, డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ రేణుకా దేవి, డాక్టర్ విజయానంద బాబు, డాక్టర్ సింథియా శుభప్రద, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ లక్ష్మీబాయి, డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


