కర్నూలు: ఉమ్మడి జిల్లాలోని నంద్యాల స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్–2, టైపిస్టు–1 పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 17లోపు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు https://kurnooldcourt.gov.in/ వెబ్సైట్ను సందర్శించాలన్నారు. అలాగే ఆళ్లగడ్డలోని ఐదవ అదనపు జిల్లా కోర్టు (ఫాస్ట్ ట్రాక్)లో ఖాళీగా ఉన్న హెడ్ క్లర్కు (పర్మినెంట్ బేసిస్) పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 17లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆళ్లగడ్డలోని స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టులో ఖాళీగా ఉన్న కోర్టు అటెండెంట్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
జెడ్పీలో సీనియర్ సహాయకులుగా నలుగురికి పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో జూనియర్ సహాయకులు/టైపిస్టులుగా విధులు నిర్వహిస్తున్న నలు గురికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించినట్లు జిల్లాపరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో పదోన్నతి పొందిన నలుగురు ఉద్యోగులకు జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు. అలాగే పదోన్నతి పొందిన వారికి వివిధ మండల పరిషత్ కార్యాలయాలకు పోస్టింగ్స్ ఇచ్చా రు. పదోన్నతి పొందిన వారిలో డి.ప్రభాకర్ను గోనెగండ్ల, ఐ.లక్ష్మీబాయిని దొర్నిపాడు, జె.చిన్నయ్యను బనగానపల్లె, వి.లలితా జ్యోతిని పాములపాడుకు పోస్టింగ్స్ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ ఇ.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా 70 కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 10,742 మంది హాజరుకావాల్సి ఉండగా, 10,305 మంది హాజరయ్యారు. ఈ నెల 2వ తేదీ నుంచి పరీక్షల మూల్యాంకనం చేపట్టారు. సంస్కృతం సబ్జెక్టుతో మూల్యాంకనం ప్రారంభించారు.
సామాజిక బాధ్యత కలిగి ఉండాలి
కర్నూలు కల్చరల్: యువత చదువుతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య వి.వెంకటబసవరావు అన్నారు. యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ స్వచ్ఛతా యాక్షన్ ప్లాన్లో భాగంగా కర్నూలు ఆర్టీసీ బస్స్టేషన్ ప్రాంగణంలో చేపట్టిన ఒక రోజు పరిశుభ్రతా కార్యక్రమాన్ని గురువారం వీసీ వర్సిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వ విద్యాలయం ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు బస్టాండ్ పరిసరాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ప్రతి పౌరుడూ తెలుసుకోవాలని వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నాయుడు అన్నారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పి.నాగరాజు, హైదరాబాదులోని ఎన్ఎస్ఎస్ డైరెక్టరేట్ ప్రతినిధి సంజయ్, కర్నూలు–1 డిపో మేనేజర్ కె.సుధారాణి, ఆర్టీసీ కంట్రోలర్ వాసుదేవ రెడ్డి, వర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె.వెఎంకటరత్నం, డాక్టర్ బి.విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాద రెడ్డి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.


