కర్నూలు(సెంట్రల్): ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పది పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం 9 గంటలకే విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. పరీక్షా సమయానికి అనువుగా ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్లు కూడా సెల్ఫోన్లను తీసుకెళ్లరాదన్నారు. మంచి గాలి, వెలుతురు వచ్చే గదులున్న పాఠశాలలనే కేంద్రాలుగా గుర్తించాలన్నారు. పిల్లలు కింద కూర్చొని పరీక్ష రాసే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. డీఈఓ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ కింద 33,796 మంది, ప్రైవేట్ కింద 1975 మంది హాజరవుతున్నారన్నారు. 160 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 8 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్రాజు, డీపీఓ భాస్కర్, డీటీసీ శాంతకుమారి పాల్గొన్నారు.


