శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవను నిర్వహించింది. ముందుగా దేవాలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఆశీలు చేసి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దాసుపత్రిలో పనిచేయని లిఫ్ట్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో లిఫ్ట్ పనిచేయడం లేదు. కొన్ని రోజులుగా వైద్యులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు అంతస్తులు ఉన్న ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో చిన్నపిల్లల విభాగం, మొదటి అంతస్తులో ఎన్ఐసీయూ, చిన్నపిల్లల శస్త్రచికిత్సల విభాగం, చిన్నపిల్లల విభాగం, రెండో అంతస్తులో న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ, మూడో అంతస్తులో పలు విభాగాలు ఉన్నాయి. ఆయా విభాగాలకు వైద్యులు, వైద్య సిబ్బంది, రోగులు, వారి సహాయకులు ఈ లిఫ్ట్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే మెట్లు లేదా ర్యాంపు ద్వారా పైకి వెళ్లాల్సి ఉంటుంది. వీటిపై యువకులు, ఆరోగ్యంగా ఉండేవారు మాత్రమే వెళ్లగలరు. రోగులు, వృద్దులు, కీళ్లనొప్పులు ఉన్న వారు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లిఫ్ట్ పనిచేయకపోవడంతో పక్కనే ఉన్న గైనకాలజి విభాగం లిఫ్ట్ను తాత్కాలికంగా వాడుకుంటున్నారు. దీంతో ఈ లిఫ్ట్పై అదనపు భారం పడుతోంది. వైద్యులు, రోగులు, వైద్య సిబ్బంది పైకి వెళ్లి, కిందకు రావాలంటే చాలా సమయం పడుతోంది. ఈ సమస్యల పరిష్కారంగా వెంటనే అధికారులు చిన్నపిల్లల విభాగంలోని లిఫ్ట్ను మరమ్మతు చేయించాలని రోగులు కోరుతున్నారు.


