అక్రమాలు ఇలా..
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 2025–27 బ్యాచ్లో 49 కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇటీవలే మేనేజ్మెంట్, స్పాట్ అడ్మిషన్లకు అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రత్యేకంగా మార్గదర్శకాలను ఈ నెల 7వ తేదీన విడుదల చేసింది. ఈ రెండు కోటాలో సీట్లు పొందాలనుకునే వారు ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకోవాలి. ఏ కాలేజీలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి.. మేథాడాలజీలో ఎన్ని సీట్లు మిగిలిపోయాయి.. తదితర వివరాలను ప్రకటించి, మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి కనీసం రెండు పత్రికలకు ప్రకటనలు ఇచ్చి దరఖాస్తులను స్వీకరించాలి. కానీ ఇలా ఏ కాలేజీ కూడా చేయడం లేదు. ఇటీవల మోగా డీఎస్సీ ప్రకటన తరువాత కొంత మంది బీఈడీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే యాజమాన్యాలు ఆయా కాలేజీల్లో సీట్లన్నీ ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన వారితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా భర్తీ చేసుకుంటున్నాయి. స్థానికులు సీటు కోరినా కూడా ఖాళీలు లేవని చెబుతున్నారు. అసలు ఇంత వరకు స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. కానీ కాలేజీల యాజమాన్యాలు సీట్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో భర్తీ చేసేసుకుని..స్థానికులు అడిగితే లేవని చెబుతున్నాయి.
త్వరలో ఉన్నత విద్యా మండలి విచారణ?
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కాలేజీలకు భవనాలు లేకపోయినా కూడా అనుమతులు ఇచ్చారని పలు విద్యార్థి సంఘాల నాయకులు.. జిల్లా కలెక్టర్ నుంచి ఏపీ ఉన్నత విద్యా మండలి వరకు ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. దీంతో పాటు థర్డ్ సెమిస్టర్లో బ్లాక్ టీచింగ్ చేయకపోయినా చేసినట్లు..సెమిస్టర్ పరీక్షల ఫీజులు కట్టించుకున్నారు. బ్లాక్ టీచింగ్పై చేసిన ఫిర్యాదులపై డీఈఓ విచారణ చేయించారు. రెండు, మూడు కాలేజీలకు చెందిన వారు మినహా మిగిలిన వారు బ్లాక్ టీచింగ్కు హాజరు కాలేదని హెచ్ఎంలు రాత పూర్వకంగా రాసి ఇవ్వడంపై సైతం విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులపై త్వరలోనే ఉన్నత విద్యా మండలి విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో కొన్ని బీఈడీ కాలేజీలకు భవనాలు లేకుండా అనుమతులు ఇచ్చారని ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై నేను వ్యక్తిగతంగా కూడా తెలుసుకున్నా. భవనాలు లేకపోయినా అనుమతులు ఇచ్చిన వాటిని నోట్ చేసుకున్నా. త్వరలోనే అఫ్లియేషన్ ఇచ్చిన కాలేజీ భవనాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తాం. మేనేజ్మెంట్ కోటా, స్పాట్ అడ్మిషన్స్కు ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు ఇచ్చింది. వీటిని అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఆచార్య వి.వెంకట బసవరావు, ఆర్యూ వీసీ
డోన్లో శ్రీసుధ అనే బీఈడీ కాలేజీకి సొంత భవనం లేకపోవు. దీంతో అదే పేరుతో ఉన్న స్కూల్ భవనాలను, గాయత్రి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కాలేజీకి వైష్ణవి కాలేజీ భవనాలు చూపించి అఫ్లియేషన్ తీసుకున్నారు. ఈ రెండు కాలేజీలకు సొంత భవనాలు లేవు. అలాగే సిబ్బంది కూడా లేరు. అవన్నీ కేవలం పేపర్లో మాత్రమే ఉన్నాయి.
కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామ సమీపంలో బాలాజీ బీఈడీ కాలేజీ ఉన్నట్లు ఆర్యూ అఫ్లియేషన్ కమిటీ అనుమతులు ఇచ్చింది. ఇందుకు కర్నూలు నగరంలోని కృష్ణానగర్లో ఓ పారామెడికల్ కాలేజీ భవవాన్ని చూపించారు. కనీసం ఇటుక కూడా లేని ఈ కాలేజీకి ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి అనుమతులు ఇచ్చారు.
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఈ కాలేజీలే కాదు మరికొన్నింటికి సొంత భవనాలు లేకపోయినా అనుమతులు ఇచ్చారు. కేవలం కాగితాల్లోనే సిబ్బందిని చూసి వర్సిటీ అఫ్లియేషన్ కమిటీలు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చాయి.
ఆర్యూ పరిధిలో
కొన్ని బీఈడీ కాలేజీలకు భవనాల్లేవు
అయినా అఫ్లియేషన్
మార్గదర్శకాలకు విరుద్ధంగా
కాలేజీ యాజమాన్య సీట్ల్ల భర్తీ
బోధన సిబ్బంది లేకున్నా
ఉన్నట్లు కాగితాల్లో సృష్టి
అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు
మామూళ్ల సమర్పణ
త్వరలో ఉన్నత విద్యా మండలి
అధికారుల విచారణ?
ఒక్కో కాలేజీకి అఫ్లియేషన్ కమిటీకి రూ.20వేల నుంచి రూ.30 వేలు, వర్సిటీలో కీలక అధికారికి రూ.30 వేలు, వర్సిటీ సీడీసీలో పని చేసే ఇద్దరికి రూ.5 వేల చొప్పున, అఫ్లియేషన్ కమిటీలో ఓ సభ్యుడికి కోరినప్పుడల్లా పార్టీలు ఇచ్చినట్లు, బీఈడీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ పేరుతో రూ.15 వేలు వసూళ్లు చేసినట్లు సమాచారం. వర్సిటీ అనుబంధ కాలేజీలన్నీ ఐఏఎస్ఈ(ప్రభుత్వ బీఈడీ కాలేజీ), మరొకటి, రెండు మినహా మిగిలిన అన్ని కాలేజీలు ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.


