కిమ్స్ హాస్పిటల్ మేనేజర్ ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు శివారులోని తుంగభద్ర బ్రిడ్జి దగ్గర కేసీ కెనాల్లోకి దూకి కిమ్స్ హాస్పిటల్ మేనేజర్ అన్వర్(60) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గత 20 ఏళ్లుగా కిమ్స్ హాస్పిటల్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఆదివారం ఉదయం మాసామసీదు వద్ద కేసి కెనాల్లో శవమై తేలాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు అర్బన్ తాలుగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కుటుంభ సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య పాతిమాతో పాటు కుమారుడు, కూతురు సంతానం. సోదరి కుమారుడు జావీద్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నదీ తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
సి.బెళగల్: తుంగభద్ర నదితీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించిందని ఎస్ఐ వేణుగోపాల్రాజు తెలిపారు. ఆదివారం నదితీర గ్రామమైన ముడుమాల గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీస్లకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వేణుగోపాల్రాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కర్నూలు నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మాజీ బృందం సభ్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని సంఘటన స్థలంలోనే ఖననం చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతుడి ఎత్తు 172 సెంటీమీటర్లు ఉన్నట్లు, మృతుడి ఎడమ భుజముపై ఎస్యూ అనే అక్షరాలు ఉన్నాయని, వివరాలు తెలిస్తే సి.బెళగల్ పోలీస్లను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
నల్లమల ఘాట్లో రోడ్డు ప్రమాదం
మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘాట్రోడ్డులోని బొగద దొరబావి వంతెన వద్ద గిద్దలూరు నుంచి వస్తున్న లారీ, నంద్యాల నుంచి వెళ్తున్న కారు మలుపు వద్ద ఢీకొన్నాయి. కారు ముందు భాగం దెబ్బతినింది. కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. కొద్దిసేపు ఘాట్రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మహానంది, శిరివెళ్ల మండలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు
ఆదోని అర్బన్: బాలికను వేధించడంతో త్రీటౌన్ పోలీసులు బీజేపీ నాయకుడు మహేష్నాయక్ అనే యువకుడిపై ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాలు.. మహేష్నాయక్ అనే బీజేపీకి చెందిన నాయకుడు వేధిస్తున్నాడని శనివారం ఎమ్మెల్యే పార్థసారథికి ఫిర్యాదు చేసేందుకు బాధితులు వచ్చారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు మహేష్నాయక్ ఎమ్మెల్యే ఇంటి ముందే వారితో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. వెంటనే ఇరువురు త్రీటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లారు. బాలికను వేధిస్తున్నాడని బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. మహేష్నాయక్పై బాలిక తల్లిదండ్రులు దాడి చేసినట్లు మహేష్నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
కిమ్స్ హాస్పిటల్ మేనేజర్ ఆత్మహత్య


