విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
కోసిగి: విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు జెడ్పీ సీఈఓ నాసర రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కోసిగి మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం దుద్ది గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేయగా.. హాజరు పట్టిక ఉద్యోగుల సంతకాలు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పనిచేసే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీఓ ఎస్. మహబూబ్ బాషాను ఆదేశించారు. సాతనూరు గ్రామంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టారు.
వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఇక్బాల్ బాషా
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పాణ్యానికి చెందిన ఎస్. ఇక్బాల్ బాషాను నియమించారు. అలాగే కళాకారుల విభాగం ఆలూరు, కర్నూలు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులుగా వడ్ల మల్లికార్జున ఆచారి, కన్నా ప్రదీప్ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
క్యాజువాలిటీలో ఆకస్మిక తనిఖీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యసేవలు, సిబ్బంది హాజరు, ఎఫ్ఆర్ఎస్, సమయపాలన తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ఆర్ఎంఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తనిఖీల్లో నిర్లక్ష్యం బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్యాజువాలిటిలో సీఎంఓలు, డ్యూటీ డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఆయన వెంట ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, క్యాజువాలిటి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫయాజ్ ఉన్నారు.
గోనెగండ్లలో డెంగీ కేసు
గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల ఎస్సీ కాలనీలో 34 ఏళ్ల వ్యక్తి డెంగీ బారిన పడ్డాడు. గత కొన్ని రోజులుగా జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించుకున్నాడు. అయినా తగ్గకపోడంతో కర్నూలు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించగా డెంగీ వ్యాధి సోకినట్లు తెలిసింది. దీంతో జిల్లా మలేరియా సబ్యూనిట్ అధికారి విజయ్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ కృష్ణుడు గోనెగండ్ల వైద్య సిబ్బంది శుక్రవారం డెంగీ సోకిన వ్యక్తి ఇంటి ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కాలనీవాసులకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
21 నుంచే సాగునీరు విడుదల చేయాలి
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు కింద రబీలో సాగుచేసుకుంటున్న గోనెగండ్ల, కోడుమూరు, పత్తికొండ ప్రాంతాల ఆయకట్ట భూములకు ఈనెల 21 నుంచే సాగునీరు విడుదల చేయాలని జీడీపీ ఆయకట్టు సాగునీటి సంఘం అధ్యక్షుడు మల్లికార్జున గౌడ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం సాగునీటి సంఘం అధ్యక్షుడు, సంఘం సభ్యులతో కలిసి ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది కుడి కాలువ కింద 11 వేల ఎకరాలు, ఎడమ కాలువ కింద 2వేల ఎకరాలు సాగు కావచ్చునని తెలిపారు. పంట కాలం పూర్తయ్యే వరకు సాగునీటిని విడుదల చేయాలని కోరారు.
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం


