విద్య, పరిశోధనల్లో పరస్పర సహకారం
● ట్రిపుల్ఐటీ, ఆర్యూ మధ్య ఒప్పందం
కర్నూలు సిటీ: విద్య, పరిశోధన అంశాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీ), రాయలసీమ యూనివర్సిటీలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు సోమవారం జగన్నాథగట్టులో ఉన్న ట్రిపుల్ ఐటీడీఎంలో ఆ సంస్థఽ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఆర్యూ వీసీ ఆచార్య వెంకట బసవరావు సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య, పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధిలో పరస్పర సహకారం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పాఠ్యంశాల రూపకల్పన, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు, నిర్వహణ, సమావేశాలు, ఆధునాతన ప్రయోగశాలలు, ఆవిష్కరణ, కేంద్రాల స్థాపనలో పరస్పర మద్దతుకు ఈ ఒప్పందం దోహద పడుతుందన్నారు. ఈ భాగస్వామ్యం కింద రెండు సంస్థలు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్చెయిన్, క్వాంటం, పోస్ట్ క్వాంటం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ, ఇతర అభివృద్ధి చెందుతున్న డోమైన్ల వంటి అత్యాధునిక రంగాల్లో ఉమ్మడి చొరవలకు అవకాశాలను అన్వేషిస్తుందన్నారు. ఈ అవగాహన ఒప్పందం రెండు సంవత్సరాల కాలం పాటు చెల్లుబాటు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్యూ రిజిస్ట్రార్ విజయ్కుమార్, ట్రిపుల్ఐటీ డీఎం రిజిస్ట్రార్ రాజ్ కుమార్, అచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


