
27 నుంచి గణేశ్ ఉత్సవాలు
కర్నూలు కల్చరల్: గణేశ్ ఉత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభభమవుతాయని గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. కర్నూలులోని వినాయక ఘాట్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, గూడూరు, ఇతర పట్టణాల్లో 27 నుంచి 31వ తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయన్నారు. కర్నూలు నగరంలో సెప్టెంబర్ 4వ తేదీ నిమజ్జనోత్సవం ఉంటుందన్నారు. గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా కార్యదర్శి గోరంట్ల రమణ మాట్లాడుతూ.. మట్టివినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. నగర అధ్యక్షుడు రంగస్వామి మాట్లాడుతూ.. విగ్రహాల ఎత్తులో కాకుండా సంప్రదాయ పద్ధతిలో ఉత్సవాల నిర్వహణకు పోటీ పడాలన్నారు. మండపాల నిర్వాహకులతో ఆదివారం సమావేశం నిర్వహిస్తామన్నారు. క్రెడో స్కూల్లో విద్యార్థులకు 24న వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి నగర కార్యదర్శి గురిరాజవర్మ, సభ్యులు కొట్టే చెన్నయ్య, భాను ప్రకాష్, అక్కెం విశ్వనాథ్ పాల్గొన్నారు.
వచ్చే నెల 4న కర్నూలులో
నిమజ్జనోత్సవం