
ఛాతీలో కణితి తొలగించి ప్రాణం పోశారు
కర్నూలు(హాస్పిటల్): ఛాతీలో నాలుగు కిలోల కణితి ఉన్న ఓ మహిళకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి ఆమెకు ప్రాణం పోశారు. డోన్ మండలం జొన్నగిరికి చెందిన దాసరి బేబి(40) ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేటు కాలేజిలో స్వీపర్గా పనిచేస్తోంది. ఆమెకు భర్త లేడు. కష్టపడి జీవనం సాగిస్తున్న ఆమెకు తీవ్ర అనారోగ్యం వచ్చి పడింది. అకస్మాత్తుగా విపరీతమైన దగ్గు, ఊపిరి ఆడేది కాదు. ఇటీవల ఆమె చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగంలో వైద్యులను కలిసింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె ఛాతీలో నాలుగు కిలోల కణితి ఉన్నట్లు గుర్తించారు. రక్తనాళాలను, వాయునాళాన్ని గట్టిగా ఒత్తేస్తోందని, ఆమెకు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ నెల 22న కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్వోడీ డాక్టర్ సి. ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
పెద్దాసుపత్రిలో మహిళకు అరుదైన ఆపరేషన్