57 రోజుకు చేరిన రిలే దీక్షలు
ఆదోని టౌన్: ఆదోని జిల్లాను సాధించుకునేంతవరకు ఐక్యంగా పోరాడుదామని జేఏసీ నాయకులు రఘురామయ్య, కుంకనూరు వీరేష్, దస్తగిరి నాయుడు పేర్కొన్నారు. జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 57వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షల్లో ఆదోని జిల్లా జేఏసీ నాయకులు కమతం వెంకటేష్, వై.వెంకోబ, సి.వీరేష్, నరేంద్రయాదవ్, కుమార్, రామలింగయ్య, వెంకటేష్, నరసింహా, మల్లికార్జున, అశోక్ కూర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయన్నారు.
నేడు డయల్ యువర్ ఎస్ఈ
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్లో సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 7382614308 తెలియజేయాలని పేర్కొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
కర్నూలు (టౌన్): సంక్రాంతి వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను డీఐజీ, జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కేవలం సంప్రదాయ క్రీడలు మాత్రమే ఆడాలని సూచించారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో ఎక్కడైనా కోడి పందేలు, పేకాట, జూదం, గుండాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై డయల్ 112, డయల్ 100కు లేదంటే స్థానికంగా పోలీసు స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దర్శనం నిలుపుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి మాత దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీ అధికారి మహమ్మద్ ఆదివారం తెలిపారు. మార్కాపురం జిల్లా నెక్కంటి పరిధిలోని ఇష్టకామేశ్వరి మాత అమ్మవారి ఆలయ పరిసరాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు వాహనాలను నిలుపుదల చేసి దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు గమనించి ఇష్టకామేశ్వరి ఆలయ దర్శనం వాయిదా వేసుకోవాలని సూచించారు.
అటవీ శాఖలో డ్రోన్ పైలట్లు
ఆత్మకూరురూరల్: అటవీ సంరక్షణలో డ్రోన్ల వినియోగం కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు అటవీ డివిజన్కు చెందిన ఆరుగురు అధికారులు డ్రోన్ పైలట్లుగా శిక్షణకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆత్మకూరు డివిజన్ ప్రాజెక్ట్ టైగర్ డీడీ విగ్నేష్ అపావ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లోని డ్రోన్ అకాడమిలో శిక్షణ కోసం ఆరుగురు అధికారులను ఎంపిక చేసి పంపామని, వారు డ్రోన్ అకాడమి డైరెక్టర్ వద్ద ఆదివారం రిపోర్ట్ చేశారన్నారు. కెపాసిటి బిల్డింగ్లో భాగంగా డివిజన్కు చెందిన ఎఫ్ఎస్ఓలు మహబూబ్ బాషా, రాజశేఖరరెడ్డి, ఎఫ్బీవోలు పీరా సయ్యద్, ఇస్మాయిల్, రజాక్ సాహెబ్, శ్రీనివాసులు శిక్షణ పొందడం కోసం వెళ్లారని వివరించారు.
31న ఎంపీపీపై అవిశ్వాసం
జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లా మండల ఎంపీపీ సువర్ణమ్మపై ఈనెల 31వ తేదీన మండల సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు ఎంపీటీసీ సభ్యులకు ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి నోటీసులు జారీ చేశారు. ఈనెల 5వ తేదీన ఎంపీపీ సువర్ణమ్మను ఎంపీపీ పీఠం నుంచి దించేందుకు గాను మండలంలోని ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన సంగతి పాఠకులకు విధితమే. ఈ మేరకు వినతిపత్రాన్ని పరిశీలించి అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెట్టేందుకు ఈనెల 31వ తేదీని ఆర్డీఓ నిర్ణయించారు. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా అందులో 9 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అ భ్యర్థులు గెలుపొందగా తాటిపాడు, పారుమంచాల గ్రామాల్లో ఇండిపెండెంట్లు ఉన్నారు.
57 రోజుకు చేరిన రిలే దీక్షలు


