యువతిని వేధిస్తున్నాడని చంపేశారు!
పాణ్యం: గడివేముల మండలంలో సంచల నంగా మారిన యువకుడి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన ఓ యువతిని వేధిస్తున్నాడని యువకుడిని దారుణంగా చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు పాల్పడిన యువతితోపాటు ఓ యువకుడు, ఇద్దరు మైనర్లను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పాణ్యం సర్కిల్ కార్యాలయంలో నంద్యాల ఎస్డీపీఓ మందజావళి విలేకర్ల సమావేశంలో హత్య కేసు వివరాలను మీడియాకు వివరించారు. గడివేముల పట్టణానికి చెందిన వినోద్కుమార్(19) డీఎంఎల్టీ కోర్సు చేస్తున్నాడు. కాగా రేవనూరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆరు నెలల క్రితం సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైంది. అయితే ఆమెను నిత్యం ఫోన్లో వేధిస్తుండటంతో వినోద్ కుమార్ను హత్య చేయాలని కుట్ర పన్నింది. ఈ మేరకు తనకు పరిచయం ఉన్న నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గర బర్మశాల వద్ద ఉంటున్న తేల్కర్ మణికంఠ సహాయంతో పథకం రూపొందించింది. గత ఏడాది ఆగస్టు 31వ తేదీన నంద్యాలకు చెందిన ఇద్దరు మైనర్లును తోడు తీసుకుని ఆటోలో గడివేములకు వెళ్లారు. వినోద్కుమార్కు ఫోన్ చేసి ఇంటి నుంచి బొల్లవరం రస్తాలోని మద్దిలేరు వాగు వద్దకు రప్పించారు. బైక్పై వచ్చిన వినోద్కుమార్ను జన సంచారం లేని చోటుకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపేశారు. ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి పాణ్యం మండలం పిన్నాపురం రస్తాలోని గాలేరు నగరి కాల్వలో పడేశారు. ఆ సమీపంలోనే బైక్ను కూడా నీటిలో వేసేశారు. కాగా తమ కుమారుడు కనిపించడం లేదని వినోద్కుమార్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు కేసు ఛేధించి హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్డీపీఓ మందజావళి తెలిపారు. హత్యకు పాల్పడిన తేల్కర్ మణికంఠ, యువతితో పాటు ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశామన్నారు. కేసును ఛేదించిన గడివేముల ఎస్ఐ నాగార్జునరెడ్డి, పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు.
నాలుగు నెలల క్రితం
యువకుడి హత్య
మృతదేహాన్ని గాలేరు నగరిలో
పడేసిన వైనం
కేసును ఛేదించిన పోలీసులు
ఇద్దరు మైనర్లు,
యువతి, యువకుడు అరెస్ట్


