
జర్నలిస్టులకు రక్షణ కల్పించకపోతే ప్రజాస్వామ్యానికి హాని
కర్నూలు(సెంట్రల్): సాక్షి దినపత్రిక ఏలూరు కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. జర్నలిస్టులకు రక్షణ క ల్పించకపోతే ప్రజాస్వామ్యానికి హాని కలిగే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వెలిబుచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాను ఆయన కార్యాలయంలో కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరంట్లప్ప, సీనియర్ జర్నలిస్టు సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తప్పులు, ఒప్పులు, అక్రమాలు నిజాలను బయట పెట్టే బాధ్యత పత్రికలపై ఉంటుందన్నారు. అందులో భాగంగా దృష్టికి వచ్చిన అంశాలపై కథనాలు, విశ్లేషణలు చేస్తుంటాయన్నారు. అయితే ఏదైనా పత్రికలో వార్త వచ్చిన సమయంలో సంబంధిత వ్యక్తులు ఇబ్బందిగా భావిస్తే ఖండన ఇవ్వవచ్చు అన్నారు. అందుకు సంతృప్తి చెందకపోతే న్యాయస్థానాల ద్వారా లీగల్గా ప్రొసీడ్ అయ్యేందుకు వీలు ఉందన్నారు. అయితే అవేవీ పట్టకుండా ప్రభుత్వంలోని కొందరు నేతలు పత్రికల్లో వార్తలు వస్తే జర్నలిస్టులను భయపెట్టే విధంగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టు కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంస్థలపై దాడులు అధికమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శివశంకర్, ఎర్రమల, సీనియర్ జర్నలిస్టులు రవికుమార్, హుస్సేన్, రవిప్రకాష్, శ్రీనాథ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు
వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులు