పీజీఆర్ఎస్ కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ వివిధ సమస్యలపై అందిన అర్జీలు 158
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ నవీన్, డీఆర్వో శ్రీధర్రెడ్డి, కేఆర్ఆర్సీ ఎస్డీసీ నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ శ్రీని వాసరావు అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డీఆర్వో శ్రీధర్రెడ్డి అన్నిశాఖలను సమన్వయం చేసుకుంటూ పరిపాలన మరింత సమర్థవంతంగా అందించాలన్నారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లపై ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అన్నిశాఖల తమ పరిధిలోని డిపాజిట్లను వెంటనే యాక్టివేట్ చేసి కలెక్టరేట్ పూల్ అకౌంట్కు బదిలీ చేయా లని ఆదేశించారు. ఇప్పటికే పునరుద్ధరించిన డిపాజిట్లలో ఇంకా సంబంధితశాఖల వద్ద ఉన్న నిధులను రెండు, మూడు రోజుల్లోపు తప్పనిసరిగా బదిలీ చేయాలని స్పష్టంచేశారు. పీజీఆర్ఎస్, సీఎం గ్రీవెన్స్, పీజీఆర్ఎస్ పోర్టల్లో గడువు దాటిన ఫిర్యాదులు అధికంగా ఉన్న శాఖల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పంచాయతీ, మునిసిపల్ పరిపాలన, రెవెన్యూ, సర్వే, జలవనరులు, పోలీస్, రిజిస్ట్రేషన్, పౌరసరఫరాలు తదితరశాఖల అధికారులు పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ప్రతి ఫిర్యాదుపై స్పష్టమైన చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించటంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ నాటికి సీఎం గ్రీవెన్స్, పీజీఆర్ఎస్ పూర్తిగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు 158 అర్జీలను స్వీకరించారు.
ముఖ్యమైన అర్జీలు ఇవీ..
జిల్లాలోని 25 మండలాల్లో గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో సచివాలయాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించాలని, ఆధార్కార్డులు లేని వారికి వెంటనే ఆ కార్డులు జారీ చేయటంతో పాటు ప్రత్యేక వసతిగృహం, కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని, గిరిజనులపై అకృత్యాలు, దౌర్జన్యాలు జరగకుండా పోలీస్ రక్షణ కల్పించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్కు ఆంధ్రప్రదేశ్ యానాదుల ఎడ్యుకేషన్, పారిశుద్ధ్య కార్మికుల డెవలప్మెంట్ సొసైటీ, ఎరుకుల ఆత్మగౌరవ సంఘం ప్రతినిధులు ఏకశిరి వెంకటేశ్వరరావు, పాండు అర్జీ ఇచ్చారు.


